మేడ్చల్, ఏప్రిల్ 2 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. మేడ్చల్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మికులను ఇబ్బంది గురి చేస్తుందన్నారు.
ప్రభుత్వ రంగం సంస్థలను కారు చౌకగా అమ్మేసి కార్మికులను రోడ్డున పడవేస్తుందన్నారు. కార్మిక చట్టాల్లో మార్పు తీసుకువచ్చి, యాజమాన్యాలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. బ్యాంకింగ్, లైఫ్ఇన్స్యూరెన్స్, రైల్వే లాంటి లాభాల్లో ఉన్న సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుందని తెలిపారు. మోటార్ వెహికల్ చట్టంలో మార్పులు తీసుకువచ్చి, రవాణా రంగంపై ఆధారపడిన కార్మికుల నడ్డి విరుస్తుందన్నారు.
దేశ సంపదనంతా పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలకు కట్టబెడుతుందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ కార్మిక, ఉద్యోగ పక్షపాతిగా మారి, వేతనాలు రెట్టింపు చేస్తూ అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని అన్నారు. ఆశ,అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, వీఆర్ఏ, వీవోఏ పంచాయతీ రంగ కార్మికులకు వేతనాలు పెంచారని తెలిపారు. ఆటో రవా ణా రంగ కార్మికుల లైఫ్ టాక్స్ రద్దు చేశారని, ప్రమాద బీమా అమలు చేస్తున్నారని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాలను రెట్టింపు చేసిందన్నారు. బీఆర్టీయూ కార్మికులకు అండగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. బీఆర్టీయూ కార్మికులకు అండగా నిలుస్తుందన్నారు.
రిసోర్స్పర్సన్ల వేతనం పెంచే విషయమై సీఎం కేసీఆర్తో చర్చించనున్నట్టు తెలిపారు. మేడే సంబురాలను జిల్లా వ్యాప్తంగా అన్ని పారిశ్రామిక వాడల్లో, అడ్డాల్లో, ఆటోస్టాండ్లలో ఘనంగా నిర్వహించాలని,మేడే జెండాను ఆవిష్కరించాలని నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి, కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, రాష్ట్ర ప్రభు త్వం కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రమణారెడ్డి, ప్రదీప్ సింగ్, రాములు చారి, సిరాజుద్దీన్, మంగ విజయరావు, చంద్రకళ, స్వప్నరెడ్డి, స్వప్న, శివాణి, లక్ష్మి, చంద్రావతి, బీంనాయుడు, నవీన్, ప్రవీణ్, శాంతా తదితరులు పాల్గొన్నారు.