KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవద్దు.. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కిషన్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ నేతలకు తెలిసిన విద్య ఒక్కటే.. రాం రాం జప్నా.. పరాయ మాల్ అప్నా.. ఈ పదేండ్లు దేశానికి మోదీ ఏం చేశారని అడిగితే చెప్పేందుకు కిషన్ రెడ్డి దగ్గరం ఏం లేదు. అందుకే జై శ్రీరాం అంటున్నారు. మేం కూడా జై శ్రీరామే. రాముడిని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకాన్ని తప్పకుండా అందరం పసిగట్టాలి. ప్రతిపక్షాల గొంతు నొక్కడం.. జైళ్లలో పెట్టడం.. ఎలక్షన్లనో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం బీజేపీకి అలవాటై పోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
లిక్కర్ స్కాంలో ఏం ఉందో అదంతా బయటపెడుతా అని కిషన్ రెడ్డి నిన్న అంటుండు. ఆ కేసు కోర్టులోనే ఉండే. నిజంగా తప్పు జరిగితే కోర్టులో పెట్టు.. కోర్టులో జడ్జి శిక్ష వేస్తడు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకునుడు కాదు.. సికింద్రాబాద్కు ఏం చేశావో చెప్పి ఓట్లు అడుగు అని కేటీఆర్ సూచించారు.
రాబోయే ఐదేండ్ల పాటు అందరికీ అందుబాటులో ఉంటాను. ఎమ్మెల్యేగా ఎలా అందుబాటులో ఉన్నానో.. ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా అలాగే అందుబాటులో ఉంటాను. మీ గొంతునై పార్లమెంట్లో మాట్లాడుతాను అని పద్మారావు అన్నారు. ఒక ఫెయిలైన ఎంపీకి, నైతిక విలువ లేని వ్యక్తి, ఎటు అధికారం ఉంటే అటు పోయే దానం నాగేందర్కు 24 ఏండ్లు కష్టమైనా నష్టమైనా కేసీఆర్ వెంట ఉన్న నాయకుడికి మధ్య పోరాటం జరుగుతోంది. పద్మారావు సెక్యులర్ నాయకుడు.. క్యారెక్టర్ ఉన్న నాయకుడు.. పద్మారావు పేరు ప్రకటించగానే అభిమానం వెల్లివిరిసింది. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.