KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఐదేండ్ల కాలంలో కిషన్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని.. కిస్మత్ బాగుండి కేంద్ర మంత్రి అయ్యారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
2018 ఎన్నికల్లో అంబర్పేట నుంచి కాలేరు వెంకటేశ్ను గెలిపించారు. కిషన్ రెడ్డి ఓడిపోవడంతో 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచాడు. కిస్మత్ బాగుండి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే 2023 ఎన్నికల్లో కిషన్ రెడ్డి అంబర్పేట్ నుంచి తాను పోటీ చేయకుండా మరొకరిని నిలబెట్టాడు. కానీ 2018 నుంచి 2023 దాకా కాలేరు వెంకటేశ్ బ్రహ్మాండంగా పనులు చేసి ప్రజల మనసు గెలుచుకున్నారు. మళ్లీ గెలిచారు.
కిషన్ రెడ్డి ఎంత గొప్పొడు అంటే.. కేంద్ర మంత్రిగా ఏం చేసిండు అంటే.. ఆయన చేసిన గొప్ప పనులు మూడే మూడు. కరోనా వస్తే.. చాలా మంది అన్నదానాలు, అంబులెన్స్లు ఇచ్చారు. కిషన్ రెడ్డి మాత్రం కుర్ కురే ప్యాకెట్లు పంచారు. కేసీఆర్ ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభించారు. తాను కూడా ఏదన్న చేయాలని చెప్పి.. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్కు ఫోన్ చేసిండట.. వెళ్లి రెండు లిఫ్ట్లు ప్రారంభించారు. నాంపల్లి నియోజకవర్గంలోని గుడి మల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులను ప్రారంభించారు. మారేడుపల్లి ఎమ్మార్వో ఆఫీసులో రేకుల షెడ్ వేయించారు. హైదరాబాద్ నగరంలో మూసీకి వరదలు వస్తే రూపాయి తేలేదు.. పైసా సాయం చేయలేదు. అంబర్పేట నియోజకవర్గంలో కేంద్రం ఆధీనంలో ఉన్న ఫ్లై ఓవర్ కట్టించండి అంటే అది పూర్తి కాలేదు. పక్కకు ఉప్పల్ ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాలేదు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్.. 36 ఫ్లై ఓవర్లు పూర్తి చేసింది. మొన్న రేవంత్ రెడ్డి బైరామల్ గూడలో ప్రారంభించిన ఫ్లై ఓవర్ కూడా మనం కట్టించిందే. కిషన్ రెడ్డికి ఓటేయాలని ఎవరన్న అడిగితే అంబర్ పేట్ ఫ్లై ఓవర్ చూసి రమ్మనండి. మనం చేసిన పనులు కూడా చూయించండి అని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు.