KTR | రంగారెడ్డి, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని..ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి ఎందుకు..ఓటు వేశామా.. అని బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంపీగా అవకాశం ఇస్తే.. నిలబడతానని ముందుకొచ్చిన ధీరోదాత్తుడు కాసాని జ్ఞానేశ్వర్’ అని కొనియాడారు. శుక్రవారం తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
బీసీల కోసం జీవితాన్ని త్యాగం చేసి కష్టపడ్డ గొప్ప నాయకుడు కాసాని అని అన్నారు. కేకే, కడియం వంటి పెద్ద పెద్ద నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో కష్టకాలంలో మనకోసం వచ్చిన కాసానిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిలబిడ్డది కేసీఆర్ అని భావించి.. కమిట్మెంట్తో ఓటు వేసి కాసానిని చేవెళ్ల ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13న చేవెళ్ల బహిరంగ సభకు ప్రతి గులాబీ కార్యకర్త తరలివచ్చి సూపర్హిట్ చేయాలన్నారు.
రేవంత్ ప్రభుత్వం ఐదేండ్లు ఉండాలని కోరుకుంటున్నామని, కానీ..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేది నల్లగొండ, ఖమ్మం బాంబులేనని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన 30వేల ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్న రేవంత్పై యువత కోపంగా ఉందన్నారు. ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయాయని, వచ్చే ఎనిమిది నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్నికల నాటి హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషో, బీజేపీ మనిషో అర్థం కావడం లేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీకి బీటీమ్గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించకుండా వారి దృష్టిని మరలిచ్చేందుకే ఫోన్ ట్యాపింగ్, స్కాములు అంటూ యూట్యూబ్లలో అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు పోయి ఆరు గారడీలు వచ్చాయని విమర్శించారు.
పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేదని, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, పెంచిన ఆసరా పింఛన్లను ఇవ్వడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కులం, మతం పేరుతో బీఆర్ఎస్ ఏనాడూ రాజకీయం చేయలేదన్నారు. 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ఆరుగురు బీసీలకు టికెట్లను ఇచ్చిందన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, యువ నేత కార్తిక్రెడ్డి, నాయకులు అవినాశ్ రెడ్డి, పర్యాద కృష్ణా రెడ్డి, నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కష్టకాలంలో పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచారని కేటీఆర్ విమర్శించారు. చేవెళ్ల, పరిగిల్లో నిర్వహించిన సమావేశాల్లో ఇద్దరు నేతలు పార్టీని వీడేది లేదని ఆస్కార్ లెవల్లో నటించారని, పదిహేను రోజుల తర్వాత ఇద్దరు నేతలు పత్తాలేకుండా పోయారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు పట్నం మహేందర్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు.
జిల్లాకు సంబంధం లేని రంజిత్ రెడ్డికి ఎంపీగా అవకాశమిస్తే కేసీఆర్ మనిషిగా కార్యకర్తలు గెలిపించినప్పటికీ పార్టీని వీడి ద్రోహం చేశారన్నారు. ‘పట్నం, రంజిత్ రెడ్డిలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా..బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ..ఆ ఇద్దరినీ పార్టీలోకి రానిచ్చేది లేదు’ అని స్పష్టం చేశారు. 2014లో స్వయంగా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించి ఎంపీగా గెలిపించినప్పటికీ ఆయన 2018లో వేరే పార్టీలోకి జంప్ అయ్యారని విమర్శించారు. కేకే, కడియం వంటి పెద్ద పెద్ద నాయకులు కష్ట కాలంలో పార్టీని వదిలి వెళ్తున్నారని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు.
గోల్నాక: అంబర్పేట డివిజన్లో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ ఎన్నికల ప్రచారాన్ని శనివారం సాయంత్రం 5గంటలకు అంబర్పేట డివిజన్ పటేల్నగర్ నుంచి ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ వచ్చాక కరెంటు లేదు. పంటలు ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పండుగలు వస్తున్నాయంటే నెల రోజుల ముందే కేసీఆర్ మమ్మల్నందరినీ అప్రమత్తం చేసేవారు. కేసీఆర్ విలువ ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తున్నది. 13న చేవెళ్లలో నిర్వహించే బహిరంగసభకు పెద్ద ఎత్తున జనం తరలిరావాలి. నాపై కూడా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే ఉంటా. బడుగు బలహీనవర్గాల గొంతు పార్లమెంటులో వినిపించాలంటే జ్ఞానేశ్వర్ను ఎంపీగా గెలిపించుకుని కేసీఆర్కు కానుకగా ఇద్దాం.
– సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే
– దయానంద్గుప్తా, ఎమ్మెల్సీ
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను అందరం కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలి.
-కాసాని జ్ఞానేశ్వర్, బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి
సబ్బండ వర్గాల కోసం దశాబ్దాలుగా సేవ చేస్తున్నా. నాకు టికెట్ ఖరారైనప్పటి నుంచి మద్దతుగా ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయి. ఆశ్వీరదించండి. సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు అవకాశం పొందిన నేతలు.. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో వేరే పార్టీల నుంచి బరిలోకి దిగారు. వారికి ఓటమి తప్పదు. రెండు పర్యాయాలుగా చేవెళ్ల అడ్డా గులాబీదే.. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది.
– గాంధీ, ఎమ్మెల్యే