కంటోన్మెంట్ : దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన ధరల వల్ల ప్రధాని నరేంద్ర మోదీని ‘ ప్రియమైన కాకుండా పిరమైన మోదీ ’ అని పిలుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 400 ఉన్న సిలిండర్ ధర రూ.1200 పెంచారని, డిసెంబర్ 3 తరువాత రూ.800 తగ్గించి రూ.400కే సిలిండర్ ఇవ్వబోతున్నామని చెప్పారు. పప్పులు, నూనే , చింతపండు, ఉప్పు, పాలు, అన్ని ధరలు జీఎస్టీ పేరుతో పెంచిన ఘనత మోదీననే విమర్శించారు. ‘ ధరలను పెంచిన బీజేపీని బొంద పెట్టవలసిన అవసరం ఉంది. అభ్యర్థి లాస్య నందితపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకు ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని’ పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సాయన్న కుటుంబాన్ని ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు సాయన్న కూతురుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందన్నారు. అనుభవమున్న కార్పొరేటర్గా లాస్యనందితకు అవకాశమిచ్చామని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కంటోన్మెంట్ ఏరియా కేంద్రం పరిధిలో ఉండడంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఆరోపించారు. ‘ ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికి అప్పగించాలని అనేక సార్లు కేంద్రాన్ని కలిశాం. ప్రధాన మంత్రిని పదిసార్లు కలిశాం. కంటోన్మెంట్లోని వంద ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్రానికి 500 ఎకరాలు ఇస్తామని చెప్పాం. పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్ ఉత్తరం కూడా రాశారు. కేసీఆర్ కేంద్రం మెడలు వంచి తెలంగాణను తీసుకొచ్చిన మాదిరిగానే కంటోన్మెంట్లోని పేదలకు పట్టాలు కూడా ఇప్పిస్తామని’ అన్నారు.
కోడళ్ల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం
రాబోయే రోజుల్లో కొత్త కార్యక్రమాలు తీసుకోబోతున్నామని, ఈసారి కోడళ్ల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం ప్రవేశ పెడతున్నామని పేర్కొన్నారు. వచ్చే జనవరిలో కొత్త పెన్షన్లు, కొత్త కార్డులు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తామని హామీనిచ్చారు. ఆసరా పింఛన్లు పెంచుతున్నామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం జనవరి నుంచి ఇస్తామని ప్రకటించారు.
ఆరోగ్య శ్రీ ని రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలు పెంచుతున్నాం. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబ పెద్దకు రూ. 5లక్షల బీమా ఇవ్వబోతున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అసైన్డ్భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనున్నామని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.