BRS | కంటోన్మెంట్: తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేండ్ల కింద మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కొత్త హామీలతో బయలుదేరారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకుండా యావత్ దేశం చెవిలో పువ్వులు పెట్టారని మండిపడ్డారు. ఇది వరకు ఇచ్చిన హామీలకే గ్యారెంటీ లేదని.. ఇప్పుడు చెప్పే మాటలకు ఏం గ్యారెంటీ ఉంటుందని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధర తగ్గినా…. మోదీ మాత్రం పెట్రోల్ ధరలు తగ్గించకుండా డబుల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేండ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి.. 30 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశారని ధ్వజమెత్తారు. అలా వసూలు చేసిన 30 లక్షల కోట్ల రూపాయల నుంచి 14.5 లక్షల కోట్లు అంబానీ, అదానీల రుణాలను మాఫీ చేశారన్నారు.
తన మాటలు నిజం కాదని కిషన్రెడ్డి, ఈటల రాజేందర్.. బీజేపీ నేతలు చెబితే.. తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ..పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పి.. వారిని నట్టేటా ముంచిన ఘనత బీజేపీ సర్కారుదేనని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. కులం, మతం ఆధారంగా ఓటు వేయొద్దని కోరారు. తెలంగాణ కోసం తెగించే కొట్లాడే బీఆర్ఎస్కే మద్దతివ్వాలన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఇంపీరియల్ గార్డెన్స్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు హామీల అమలు గురించి రేవంత్రెడ్డి నెలలు, తారీఖులు చెబుతున్నారని పేర్కొన్నారు.
రేవంత్ పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి తరలిపోతున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని కేటీఆర్ గుర్తుచేశారు. యాదాద్రి వంటి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించామన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజలంతా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని గుర్తు చేస్తున్నారని చెప్పారు. నచ్చిన నాయకుడికి ఓటేయాలంటే.. యూత్ అంతా ఓటింగ్లో పాల్గొనాలన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమ్మేళనంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ : ప్రాణం పోయినా సరే…తాము సెక్యులరిజాన్ని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ మల్లికార్జునకాలనీలో స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహాయాదవ్ నివాస సముదాయంలో ఏర్పాటు చేసిన మైనార్టీల సమావేశానికి కేటీఆర్తో పాటు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సర్వమతాలకు సమాన ప్రాతిపదికన సంక్షేమ పథకాలను అందించినట్లు గుర్తు చేశారు. పేద మైనార్టీ యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించడం కోసం షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.