BRS | ఎర్రగడ్డ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాత్రి ఎర్రగడ్డలో పాదయాత్ర చేశారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎర్రగడ్డ, ఓల్డ్ సుల్తాన్నగర్, సుల్తాన్నగర్ తదితర బస్తీల మీదుగా సాగిన ఈ పాదయాత్రలో స్థానికుల నుంచి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
పలు చోట్ల స్థానికులు భవనాల పైనుంచి పూల వర్షాన్ని కురిపించారు. కేటీఆర్తో స్థానికులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దారి పొడవునా ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి చిరు వ్యాపారులకు షేక్ హ్యాండ్ ఇస్తూ.. కేటీఆర్ ముందుకు కదిలారు. ఇంటింటికీ వెళ్లిన ఆయన కారు గుర్తుకు ఓటేసి.. ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అన్ని విధాలా ఆదుకున్న కేసీఆర్.. సుపరిపాలన అందించారని.. తమ ఓటు కారు గుర్తుకే అంటూ.. వయో వృద్ధులు, మైనార్టీలు సహా అందరూ ముక్త కంఠంతో నినదించారు. కేటీఆర్ పాదయాత్ర సందర్భంగా ఎర్రగడ్డ పుర వీధులు గులాబీమయంగా మారాయి. పార్టీ జెండాలను చేబూని మహిళలు సహా వందలాది మంది నినాదాలు చేస్తూ కేటీఆర్ను అనుసరించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సోహైల్, కార్పొరేటర్లు దేదీప్య, రాజ్కుమార్ పటేల్, ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ ఖురేషి, బోరబండ అధ్యక్షుడు కృష్ణమోహన్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.