KTR | సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంతా అయోమయంగా ఉన్నదని విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టకుండా, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలను ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరని కేటీఆర్ అన్నారు. ఫార్మా సిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి దెబ్బతినే అవకాశమున్నదన్నారు.
అభివృద్ధి దెబ్బ తింటే.. రాష్ర్టానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందన్నారు. పదేండ్లలో ప్రతి రోజూ పార్టీ కార్పొరేటర్లు ప్రజల్లోకి వెళ్లి.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలుఅమలయ్యేలా చూశారని కేటీఆర్ అన్నారు. ప్రతి ఒక్క కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషితోనే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారని కేటీఆర్ కొనియాడారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలన్నారు. ప్రజలచేత ఎన్నికైన కార్పొరేటర్లు తమకున్న అధికారాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
– ఎమ్మెల్యే తలసాని
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అన్ని రంగాల్లో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించిందన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా తమ తమ డివిజన్లలో ప్రజలతో కలిసి పనిచేద్దామని తలసాని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలుగా హామీలను అమలు చేయడం అసాధ్యమని, ఇప్పటికే ఆ పార్టీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నదని తలసాని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చకుంటే.. ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లో శనివారం జరిగిన సనత్నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆశించేది చిల్లర మాటలు, డ్రామాలు కాదని, ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు నెరవేర్చుతారో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ జల హక్కులను కృష్ణా బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్గొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, దానం నాగేందర్, పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– మేయర్
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అజెండా కోసం నిర్వహిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించడం లేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అధికారుల ఒత్తిడిని, వారి పరిమితులను అర్థం చేసుకోగలుగుతామని, కానీ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు, జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించే అంశాన్ని నిర్ణయించడం కోసమే ముఖ్యమంత్రిని కలిశానని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం 1969 నుంచి కొట్లాడిన కుటుంబం తమదని, ఒక సాధారణ కార్పొరేటర్గా ఉన్న తనను మేయర్గా గొప్ప అవకాశం ఇచ్చిన పార్టీ కోసం జీవితాంతం నిబద్ధతతో పనిచేస్తానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.