సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 29 స్థానాలకు గాను 17 చోట్ల గులాబీ జెండా ఎగిరింది. ఎంఐఎం 7 స్థానాల్లో పట్టు నిలుపుకోగా..గోషామహల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. మొత్తంగా మెజార్టీ స్థానాల్లో గులాబీ హవా కొనసాగింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 31 స్థానాలకు గాను 17 స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచింది. మొత్తంగా మహానగరంలో బీఆర్ఎస్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
భారీ మెజార్టీతో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థులు
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. కుత్బుల్లాపూర్ వివేక్ 85,400 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు 71,387, శేరిలింగంపల్లిలో అరికపూడి గాంధీ 56, 713, మల్కాజిగిరిలో 49,811 సికింద్రాబాద్లో పద్మారావుగౌడ్ 45, 240, సనత్నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ 41,827, రాజేంద్రనగర్ ప్రకాశ్గౌడ్ 31,844, అంబర్పేటలో కాలేరు వెంకటేశ్ 24,630, ఖైరతాబాద్లో దానం నాగేందర్ 22,010, కంటోన్మెంట్లో లాస్య నందిత 17,169 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.