మహానగరంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి (చేవెళ్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో) మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 17 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచి తన పట్టు నిలుపుకున్నది. ఇక గోషామహల్ నియోజకవర్గాన్ని మరోసారి బీజేపీ దక్కించుకున్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. జిల్లాలో ఉన్న మొత్తం 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఇదిలా ఉంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 85, 576 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. ఈ శాసన సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్దే కావడం విశేషం. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు అత్యల్ప మెజారిటీ వచ్చింది. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 268 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మేడ్చల్లో మల్లారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్పై 33,419 ఓట్ల మోజార్టీతో గెలుపొందగా, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతారావుపై 49,811ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చామకూర మల్లారెడ్డి 2014లో ఎంపీగా, 2018 ఎమ్మెల్యేగా, 2023లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మర్రి రాజశేఖర్ రెడ్డి తొలిసారి శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.
అంబర్పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
అంబర్పేట నియోజకవర్గంలో రెండోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ 24,537 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అసెంబ్లీకి ఐదుగురు కొత్త అభ్యర్థులు
బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, ఎంఐఎం నుంచి ఇద్దరు
సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చట్ట సభల్లో అడుగు పెడుతున్న వారిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదుగురు కొత్త అభ్యర్థులు ఉన్నారు. వారిలో హైదరాబాద్ జిల్లాలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత, బహదూర్పుర నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ ముజీన్, చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి జూల్ఫికల్ అలీ, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి ఈ సారి అంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అలాగే ఈ సారి చట్టసభల్లో అడుగు పెడుతున్న వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిలో కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, మహేశ్వరం నుంచి సబితాఇంద్రారెడ్డి ఉన్నారు. అయితే సబితా ఇంద్రారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలువగా రెండు సార్లు మంత్రిగా పని చేసిన సందర్భాలు ఉన్నాయి.
గ్రేటర్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజారిటీ
గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ.వివేకానంద 85,576 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవరం కృష్ణారావు 70,387 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. వీరితో పాటు చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ 81,660 ఓటర్ల మెజారిటీతో గెలుపొందగా, బహదూర్పుర ఎంఐఎం అభ్యర్థి 67,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదేవిధంగా అత్యల్ప మెజారిటీతో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి 268 ఓట్లతో గెలుపొందగా, యాకుత్పుర ఎంఐఎం అభ్యర్థి 810 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2175 ఓటర్ల తేడాతో నాంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మాజిద్ హుస్సేన్ సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ ఫిరోజ్ఖాన్పై గెలుపొందారు.
అసెంబ్లీ : అత్యధిక మెజారిటీ
కుత్బుల్లాపూర్ (బీఆర్ఎస్) : 85,576
చాంద్రాయణగుట్ట (ఎంఐఎం) : 81,660
కూకట్పల్లి (బీఆర్ఎస్) : 70,387
బహదూర్పుర (ఎంఐఎం) : 67,025
ఏడు స్థానాలను నిలబెట్టుకున్న మజ్లిస్
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తన స్థానాలన్నింటిని తిరిగి నిలబెట్టుకున్నది. 2018 ఎన్నికల్లో ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందింది. 2023 ఎన్నికల్లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా పాతబస్తీలోని చార్మినార్, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, మలక్పేట, కార్వాన్, నాంపల్లిలో గెలుపొందగా, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలైంది. కాగా ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులతో తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా యాకుత్పురా నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి కేవలం 810 ఓట్ల తేడాతో గెలుపొందగా, నాంపల్లిలో సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొని చివరకు 2175 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
గ్రేటర్లో ఒక్కస్థానం నిలబెట్టుకున్న బీజేపీ
హ్యాట్రిక్ సాధించి రాజాసింగ్
గ్రేటర్ హైదరాబాద్ నుంచి బీజేపీ తరఫున రాజాసింగ్ ఒక్కడే గెలుపొందారు. 2014 నుంచి వరుసగా గెలుస్తున్న రాజాసింగ్ ఈ ఎన్నికల్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009లో మంగళ్హాట్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2014లో బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్ పొంది 47వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్పై 21,312 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.