Maganti Gopinath | సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీజెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సదస్సు శనివారం తెలంగాణ భవన్లో జరిగింది. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సన్నాహక సదస్సు అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోందని అన్నారు. కల్యాణ లక్ష్మీ చెక్కులను పంచుతుంటే తులం బంగారం ఏమైందని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని మాగంటి గోపీనాథ్ తెలిపారు. ప్రతి కార్యకర్తను కాపాడుకోవాలని కేటీఆర్ సూచించారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేదాకా.. ఎమ్మెల్యేలు అందరం 24 గంటలు పార్టీకే అంకితమై పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.