Mahmood Ali | చాదర్ఘాట్, మార్చి 27: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ ఉపముఖ్య మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
17 ఎంపీ స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు. బుధవారం అజంపురాలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కాళేశ్వరాన్ని మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని గుర్తు చేశారు.