సికింద్రాబాద్, అక్టోబర్ 19: సికింద్రాబాద్లో తాను చేసిన అభివృద్ధి పనులే ఈసారి ఎన్నికల్లో విజయాన్ని అందిస్తాయని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని అడ్డగుట్ట డివిజన్లో ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. చంద్రయ్య హోటల్ నుంచి ఉదయం పది గంటలకు ప్రారంభమైన పాదయాత్ర.. సాయంత్రం వరకు కోలాహాలంగా సాగింది. కళాకారుల బృందాల ఆట పాటలు డివిజన్ ప్రజలను ఆకట్టుకున్నాయి. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పద్మారావు ఇంటింటికి వెళ్లారు.
అడుగడుగునా పద్మారావుకు మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు నినాదాలు చేశారు. వందలాది మంది నాయకులు కారు గుర్తుకే ఓటు వెయ్యాలని గోడలపై స్టిక్కర్లు వేశారు.
కారుకే ఓటు వెయ్యాలని.. కారు నమూనా బొమ్మతో ప్రచారం చేశారు. ఈ ప్రచార ర్యాలీలో గులాబీ రంగు కారు బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవ్వా.. నీ ఓటు ఎవరికి.. అని పద్మారావు అడగగా.. కేసీఆర్ కారు గుర్తుకే నా ఓటు అని చెప్పింది. అందరిని పేరు పేరునా పలకరిస్తూ పద్మారావు ముందుకు సాగాడు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ఆసరా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులందరూ పద్మారావు వెంటే ప్రచారం ముగిసే వరకు ఉన్నారు.