హైదరాబాద్: జీహెచ్ఎంసీ (GHMC) పాలకమండలి సమావేశం ఉద్రిక్తతల నడుమ మొదలైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభను ఉదయం పదిన్నర గంటలకు మొదలుపెట్టారు. తొలుత దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం సభ ప్రకటించింది. గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించారు. కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ప్రభుత్వ లోపాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మేయర్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,480 కోట్ల బడ్జెట్ను మేయర్ గద్వాల విజయ లక్ష్మి ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదించారు. దీంతో మేయర్ తీరుపై సభ్యులు విస్మయానికి గురయ్యారు. కనీస చర్చ లేకుండానే ఎలా ఆమోదిస్తారంటూ మండిపడ్డారు. సభ ప్రారంభంకాగానే బడ్జెట్పై చర్చ ప్రవేశపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు 6 గ్యారంటీల అమలుపై నిలదీశారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
ఇరుపార్టీల కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రదర్శించిన ఫ్లకార్డులను కాంగ్రెస్ సభ్యులు చించివేశారు. రౌడీముకల్లా సభలో వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు విమర్శించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేకనే కాంగ్రెస్ కార్పొరేటర్లు దిగజారి రాజకీయాలు పాల్పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల గొడవతో మేయర్ విజయ లక్ష్మి కౌన్సిల్ హాల్లోకి మార్షల్స్ను పిలిచారు. అయితే సభ్యలో గందరగోళం నెలకొనడంతో ఐదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించడంతో వారిని సస్పెండ్ చేశారు.