‘కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు చాలు.. 10 హెచ్పీ మోటర్లు పెడుతామని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నరు. 10 హెచ్పీ మోటర్లు పెట్టి..అందరూ ఒకటేసారి ఒత్తితే ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా ? సబ్ స్టేషన్లు ఉంటయా ? అన్నీ పటాకులు పేలినట్లు పేలిపోతాయి.. కాంగ్రెస్ గెలిస్తే గ్యారెంటీగా మళ్లీ చీకటి రాజ్యమే వస్తది’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం, వికారాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ‘కర్నాటక మీకు దగ్గరనే ఉంటది.. అక్కడ కూడా కాంగ్రెసోళ్లు 20 గంటల కరెంటు ఇస్తమని నరికిర్రు.. కుర్చీ ఎక్కినాంక 5 గంటల కరెంటే ఇస్తుండ్రు. మేం కాంగ్రెస్ను నమ్మి మోసపోయాం.. మీరు కూడా మోసపోవద్దని కర్నాటక రైతులు హైదరాబాద్కు వచ్చి ధర్నా చేస్తున్నరు.
కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డాం. మళ్లీ పొరపాటు జరిగితే పదేండ్ల నుంచి మేం చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయితది’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీళ్లు ఇచ్చే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను అడ్డుకున్నదే కాంగ్రెస్ నాయకులు. ఆ ప్రాజెక్టు మీద 196 కేసులు వేసి పదేండ్లు ఆలస్యం చేశారు. అయినా పట్టు పట్టి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం.కేవలం కాల్వలు తవ్వాల్సిన పని ఉంది. కారు గుర్తుకు ఓటేసి.. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి..ఏడాదిలోగా కృష్ణా నది నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.