అమీర్పేట్, ఏప్రిల్ 29: కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ అన్నారు. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన కిషన్రెడ్డి ప్రజల నుంచే కాక సొంత పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ సోమవారం ఉదయం మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి సనత్నగర్ డివిజన్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ.. కేవలం మతపరమైన అంశాల్లో ప్రచారాలు తప్పా బీజేపీ తమకు చేసిందేమీ లేదనే వ్యాఖ్యలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయన్నారు.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని చెప్పారు. ఆ పార్టీ పట్ల ప్రజలు తిరస్కరణ భావంతో ఉన్నట్టు తన పాదయాత్రలో ప్రజల మనోభావాలను గమనిస్తే తెలుస్తోందన్నారు. దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కార్ చలవేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకట్రెడ్డి, మేడే రాజీవ్సాగర్లతో పాటు కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.