కంటోన్మెంట్, ఆగస్టు 28 : కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెగా లాస్యనందిత నియోజకవర్గ ప్రజలకు సుపరిచితం. గతంలో 2015లో జరిగిన బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది. తన తండ్రి మరణానంతరం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై, వారికి అందుబాటులో ఉంటూ అభిమానాన్ని పొందారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’తో లాస్యనందిత పలు విషయాలను పంచుకున్నారు.
విజయం సాధిస్తా..
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో అత్యధిక మెజార్టీ సాధిస్తా. నా తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న ఆశయాలకు అనుగుణంగా నడుస్తా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తోడ్పాటుతో పాటు ప్రజల దీవెన ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ప్రజలు మా వైపే..
మా నియోజకవర్గ ప్రజలు తెలివైన వారు, ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇప్పటికే ప్రజలు నా తండ్రి ఆకస్మిక మరణం తరువాత ఆయన వారసురాలిగా మావైపే మొగ్గు చూపుతున్నారు. కంటోన్మెంట్కు నాన్లోకల్ లీడర్లు వస్తారు.. పోతారు. వారి మాటలు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు.
సాయన్న స్ఫూర్తితో.. బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం..
నా తండ్రి మరణం తరువాత నియోజకవర్గంలో కొంత శూన్యత ఏర్పడింది. కానీ ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీలో ముందుకు సాగుతున్నాం. ఇలాంటి తరుణంలో పెద్దదిక్కుగా నిలిచి సీఎం కేసీఆర్ మాపై నమ్మకంతో టికెట్ను కేటాయించారు. కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. సాయన్న స్ఫూర్తితో కంటోన్మెంట్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తాం.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తా. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనమయ్యే వరకు కృషి చేస్తా. నా తండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటా. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా.
నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నా..
నియోజకవర్గంలో నా తండ్రితో కలిసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేశా. నాన్న ఉన్న సమయంలోనే 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో
వార్డు నుంచి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసిన అనుభవం ఉంది. నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలతో మమేకమై పని చేస్తున్నా.
సమస్యలకు శాశ్వత పరిష్కారం..
నియోజకవర్గంలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తా. నేను గుర్తించిన ప్రతీ సమస్యపై రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యతనిచ్చి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తా.
అభివృద్ధి, సేవా కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయి..
సీఎం కేసీఆర్ నేతృత్వంలో నా తండ్రి సాయన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నా విజయానికి దోహదపడతాయి. అంతకు ముందు నేను చేసిన ప్రజాహిత సేవా కార్యక్రమాలు, నా వ్యక్తిత్వం, విద్యార్హతలు, పేదల కోసం నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అవే నన్ను ఆశీర్వదించి గెలిపిస్తాయి.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా..
నియోజకవర్గ అభివృద్ధికి నా తండ్రి పెద్దపీట వేశారు. మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యంతో పాటు కమ్యూనిటీ హాల్స్, పవర్ బోర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను వేగవంతం చేయడానికి కృషి చేస్తా. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఈ ప్రాంతం కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండటంతో అభివృద్ధి చేయాలని తపన ఉన్నా ఆర్మీ అడ్డుపడుతుండటంతో ఆలస్యమైంది. విలీనం జరిగితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పడుతుంది. దీంతో విలీనంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు కార్యాచరణ రూపొందిస్తా.