MLA Padma Rao Goud | సికింద్రాబాద్, మే 17 : గత కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మారేడ్పల్లి, ముషీరాబాద్ మండలాలకు చెందిన 255 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను సీతాఫల్ మండి చౌరస్తాలో పద్మారావు గౌడ్ శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సంబంధించి చేసిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి ప్రభుత్వం వద్ద నిధులు లేవని పదే పదే పేర్కొనడం సరికాదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో నిరంతరం తాము ప్రజలకు అండగా నిలుస్తున్నామని, సీతాఫల్ మండిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే పద్దతిని పద్దతిని పాటిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలకు, ప్రజలకు తాము అండగా నిలుస్తామని, ఏ అవసరానికైనా ప్రజలు తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.
మారేడుపల్లి మండలానికి చెందిన 159 మందికి, ముషీరాబాద్కు చెందిన 96 మందికి రూ.2.55 కోట్ల మేరకు విలువజేసే చెక్కులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పంపిణీ చేశారు. మారేడుపల్లి ఎమ్మార్వో భీమయ్య గౌడ్, ముషీరాబాద్ ఎమ్మార్వో ప్రతాప్ సింగ్, వెంకట లక్ష్మీ, కార్పొరేటర్లు హేమ, శైలజ, ప్రసన్న లక్ష్మీ , సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.