Malla Reddy | హైదరాబాద్ సుచిత్రలోని భూవివాదంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనకు కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్ ఉందని.. భూములు ఎక్కువ ఉన్నందు వల్లే వివాదాలు ఎక్కువ వస్తున్నాయని తెలిపారు. తప్పుడు పత్రాలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వాళ్ల భూములు ఆర్మీ రికార్డ్స్లోకి వెళ్లిపోయాయని.. అందుకే ఇప్పుడు తప్పుడు పత్రాలతో తన భూమిలోకి వస్తున్నారని తెలిపారు.
దీనిపై ముఖ్యమంత్రిని కలిసి అన్ని పత్రాలు ఇచ్చి వివాదంపై వివరిస్తానని మల్లారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే భూములకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణరావు ఆరోపణలపై కూడా విచారణ జరపాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. తనది తప్పని తేలితే భూమిని వారికి ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కావాలనే రాద్దాంతం చేస్తూ తమపై బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.