జూబ్లీహిల్స్, డిసెంబర్ 4: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబురాలలో మునిగిపోయారు. ఈ విజయంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు ఆ పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించడమే కాకుండా.. జూబ్లీహిల్స్ను బీఆర్ఎస్కు కంచుకోటగా నిలిపారు. ఆదివారం రాత్రి ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత రిటర్నింగ్ అధికారి రవి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రం అందుకున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
యూసుఫ్గూడ, వెంగళరావునగర్ కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, దేదీప్యరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లో పార్టీ ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో విజయోత్సవాలు నిర్వహించారు. అంతేకాకుండా.. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన నేతృత్వంలో నగరంలో సింహభాగం స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబురాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.