కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 27 : మినీ ఇండియాను తలపించే కూకట్పల్లి నియోజకవర్గంలో తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమం.. సీఎం కేసీఆర్ దీవెనలు.. ప్రజల ఆశీస్సులతో మూడోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తొమ్మిదేండ్లలో అభివృద్ధి చేసి చూపించాం..
నగర శివారు ప్రాంతమైన కూకట్పల్లిలో బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో చేసి చూపించాం. తాగునీటి సమస్యల పరిష్కారం దిశగా 46 లక్షల గ్యాలన్ల సామర్థ్యం కలిగిన 9 రిజర్వాయర్లను నిర్మించడం, 378 కి.మీ. తాగునీటి పైపులైన్లను పునరుద్ధరించాం. మరో 50 కి.మీ. మేర తాగునీటి పైపులైన్లను పునరుద్ధరించే పనులు సాగుతున్నాయి. అలాగే ప్రజలకు 20వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేయడం, నిరుపేదలకు రూపాయికే తాగునీటి కనెక్షన్ను ఇస్తూ ప్రజల అవసరాలను తీర్చేలా నీటి సరఫరా చేస్తున్నాం. 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. అభివృద్ధికి నోచుకోని కాలనీలు, బస్తీల్లో సైతం అంతర్గత రోడ్లన్నీ సీసీరోడ్లుగా అభివృద్ధి చేశాం. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి ఎక్కడా సమస్యలు రాకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేశాం.
చెరువులు, కాలువలు ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి..
కూకట్పల్లి నియోజకవర్గంలో 9 చెరువులు ఉన్నాయి. రంగధాముని (ఐడీఎల్) చెరువును రూ.50 కోట్లతో ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేస్తున్నాం. హస్మత్పేట చెరువును రూ.20 కోట్లతో సుందరీకరించడంతో పాటు మైసమ్మ, కాముని, ముళ్లకత్వ, నల్లచెరువు, కాజాకుంట చెరువులను సుందరీకరించే పనులు చేస్తున్నాం. మరోవైపు చెరువుల్లోకి మురుగునీరు రాకుండా రూ.325 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువు నాలాలను పరిరక్షించడం, ముంపు సమస్యలను తొలగించే దిశగా నాలాలన్నింటినీ పునరుద్ధరించే పనులు చేశాం.
ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాం..
శివారు ప్రాంతాలైన శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల నుంచి హైటెక్సిటీకి వెళ్లే వాహనదారులు కూకట్పల్లి ట్రాఫిక్ వలయంలో చిక్కుకునేవారు. ఈ సమస్య పరిష్కారం దిశగా జేఎన్టీయూహెచ్ హైటెక్సిటీ రోడ్డులో రూ.82 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి, కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లో రూ.40 కోట్లతో అండర్పాస్ బ్రిడ్జిని నిర్మించాం. బాలానగర్లో రూ.400 కోట్లతో, కైత్లాపూర్ నుంచి మాదాపూర్ వరకు రూ.116 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించాం. త్వరలోనే నర్సాపూర్ చౌరస్తా నుంచి సనత్నగర్ రోడ్డులో రూ.110 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి విస్తరణ, జింకలవాడ నుంచి సనత్నగర్ మార్గంలో రూ.40 కోట్లతో అండర్పాస్ బ్రిడ్జిని నిర్మిస్తున్నాం. ఈ పనులన్నీ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట
నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయడంతో పాటు సొంత ఖర్చులతో కనీస వసతులు కల్పించాం. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 11 వేల మంది విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేయడం, 10/10 మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందిస్తున్నాం. దాతల సహాయం తో పాఠశాలలను పునఃనిర్మిస్తున్నాం. బాలాజీనగర్లో 2 ఎకరాలు, బబ్బుగూడలో 4 ఎకరాలు, కేపీహెచ్బీ కాలనీలో 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం కోసం కేటాయించాం.
పేదలకు అందుతున్నసంక్షేమ పథకాలు
సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయి. కూకట్పల్లిలో 42 వేల మందికి ఆసరా పింఛన్లు, 72 వేల మందికి ఆహారభద్రత కార్డులు, 15 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సహాయం, 5 వేల మందికి కేసీఆర్ కిట్లు, 5 వేలకు పైగా సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేశాం. 1100 మందికి దళితబంధు, 300 మందికి బీసీబంధు, 120 మందికి మైనార్టీ బంధు ద్వారా ఆర్థిక సహాయం అందింది. మరో ఏడాదిలో విడతల వారీగా అందరికీ బీసీ, దళిత, మైనార్టీ బంధును అందిస్తాం.
కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి..
నియోజకవర్గంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతాల వారికి, కులాలకు సమప్రాధాన్యత ఇస్తున్నాం. అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ కానుకలు అందిస్తున్నాం. కూకట్పల్లిలో రామాలయం, చిత్తారమ్మతల్లి దేవాలయం, మూసాపేటలో లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం, ఫతేనగర్లో శివాలయం, కేపీహెచ్బీ కాలనీలో శివాలయాలను పునఃనిర్మించాం. పలు ప్రాంతాల్లో మసీదులు, చర్చిలను అభివృద్ధి చేశాం. అలాగే బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి బాబూ జగ్జీవన్రామ్ పేరును, బాలానగర్ మెట్రో స్టేషన్కు అంబేద్కర్ పేరును పెట్టడం జరిగింది. అన్ని మతాల శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తూ ప్రాంతాలు, కులాలకతీతంగా కలిసిమెలిసి ఉండేలా కృషి చేస్తున్నాం.
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం
కూకట్పల్లి నియోజకవర్గంలో 18 బస్తీ దవాఖానలు, 3 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందుతున్నాయి. కేపీహెచ్బీ కాలనీలో 100 పడకల వైద్యశాల నిర్మాణ పనులు మొదలు పెట్టాం. బస్తీ దవాఖానల్లో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేస్తూ మందులు అందిస్తున్నాం. మాతా, శిశు మరణాల నివారణ దిశగా బాలింతలు , చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం.
రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తా..
సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తా. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు. నియోజకవర్గంలో కండ్లముందే జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. మరింత అభివృద్ధి కోసం ఆశీర్వదించాలని కోరుతా. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంది. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తా.