ఎల్బీనగర్ , ఏప్రిల్ 11 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కరెంటు, మంచినీటి కష్టాలు తెచ్చిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్లలో మూలన పెట్టిన ఇన్వర్టర్లు, జనరేటర్లను రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని, ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు తథ్యమన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ మెజార్టీని అందించాలని కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులంతా ఇంటింటికీ ప్రచారం చేసి.. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి భారీ మెజార్టీని అందించాలన్నారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ నియోజకవర్గంలోని శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన రీతిలోనే పార్లమెంటు ఎన్నికల్లోనూ పనిచేయాలన్నారు.
ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తాను స్థానికుడినని, అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని, బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే పార్లమెంటులో తెలంగాణ గళం వినిపిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు జీవీ సాగర్రెడ్డి, జిన్నారం విఠల్రెడ్డి, ప్రవీణ్కుమార్, వివిధ డివిజన్ల అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్, జక్కల శ్రీశైలం యాదవ్, తోట మహేశ్ యాదవ్, నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, గజ్జల మధుసూదన్రెడ్డి, జోగు రాములు, సొంటి చంద్రశేఖర్రెడ్డి, పులిపాటి త్రివేది తదితరులు పాల్గొన్నారు.