ఇటీవల చెన్నై సూపర్ స్టార్ రజినీకాంత్ శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలిని చూసి ఇండియాలోనే ఉన్నానా? అమెరికాలో ఉన్నానా? అని ఆశ్చర్యపోయారు. ఇక్కడి ఫ్లైఓవర్లు, బిల్డింగ్లు, కట్టడాలు రజినీకాంత్కు కనిపించాయి.. కానీ కాంగ్రెస్ గజినీలకు కనిపించడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రోడ్డు షో నిర్వహించి పలు కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రసంగించారు. నగరంలో శాంతిభద్రతలు బాగుండాలంటే అది ఒక్క కేసీఆర్ పాలనతోనే సాధ్యమవుతుందని చెప్పారు. కరెంట్ కటకటలు, తాగునీరు అవస్థలు లేవని, నగరంలో ఇప్పటికే లక్ష డబుల్ బెడ్ రూంలు నిర్మించామని, త్వరలో మరో లక్ష ఇండ్లు నిర్మించి పేదలందరికీ అందిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ, జాతీయ కంపెనీల కార్యాలయాలన్నీ ఉన్న శేరిలింగంపల్లి అభివృద్ధి గురించే దేశం మొత్తం మాట్లాడుకుంటుందని అన్నారు. రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్కు 9 స్టాపులతో ఏర్పాటు చేసిన ఎయిర్పోర్టు మెట్రోకు టెండర్లు పూర్తయినట్లు చెప్పారు. ఒక్క కేసీఆర్ను ఓడించడానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీల పెద్దోళ్లు గుంపులు గుంపులుగా వస్తున్నారని, సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే హైదరాబాద్లో అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన ప్రభుత్వం తమదని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం శేరిలింగంపల్లిలోని తారానగర్ తుల్జాభవానీ దేవాలయం వద్ద నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశం మొత్తం శేరిలింగంపల్లి అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నదన్నారు. ఇక్కడ అంతర్జాతీయ, జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని కొనియాడారు. ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని వివరించారు. ఐటీ కంపెనీల రాకతో హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ తదితర వ్యాపారాలు పరోక్షంగా వృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ గచ్చిబౌలి చూసి ఇండియాలోనే ఉన్నానా? అమెరికాలో ఉన్నానా? అని ఆశ్చర్యపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక్కడి ఫ్లైఓవర్లు, బిల్డింగ్లు, కట్టడాలు రజినీకాంత్కు కనిపించాయి..కానీ ఇక్కడున్న కాంగ్రెస్ గజినీలకు కనిపించడం లేదని విమర్శించారు. కరెంట్ కష్టాలు, తాగునీరు అవస్థలు లేకుండా నగరాన్ని బాగు చేసుకున్నామని వివరించారు. నగరంలో ఇప్పటికే లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామన్నారు. త్వరలో మరో లక్ష నిర్మించి పేదలందరికీ అందిస్తామని చెప్పారు. కులం కుంపట్లు, మతం మంటలు లేని నగరాన్ని మళ్లీ అల్లకల్లోలం సృష్టించే వారికి అప్పచెబితే అభివృద్ధి ఆగిపోతుందని పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో అన్ని రకాల ప్రజలు ఉంటారన్నారు.
శేరిలింగంపల్లిలో గతంలో ప్రతి షాపు ఇన్వర్టర్లు, జనరేటర్లతో ఉండేవని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అవేవి లేవన్నారు. 24 గంటల కరెంట్తో 3 షిఫ్ట్ల్లో పనిచేసుకునేలా సదుపాయం ఉందని చెప్పారు. వచ్చే టర్మ్లో 250 కిలో మీటర్ల వరకు మెట్రో విస్తరిస్తామని వివరించారు. చందానగర్, మియాపూర్ అవతలి వరకు మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ శివారు ప్రాంతాల్లో 20వేల కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రజలతో ఉండే మనిషి అని కొనియాడారు.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ను కాంగ్రెస్ చేతిలో పెడితే స్కాంలు జేసి మింగేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ఆల్విన్ క్రాస్రోడ్స్లో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలన మెచ్చి అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వచ్చాయని అన్నారు. మరిన్ని కంపెనీల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఎన్ని కంపెనీలు వస్తే అంత ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. శేరిలింగంపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ జెండా ఎత్తేసిందన్నారు. ఆ పార్టీలకు డిపాజిట్ కూడా రావని చెప్పారు. ఒక్క కేసీఆర్ను ఓడించడానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీల పెద్దోళ్లు వస్తున్నారని చెప్పారు. మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని మాయమాటలు చెప్పి ప్రధాని అయ్యారని విమర్శించారు. ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేకుండా అన్నదమ్ముళ్ల కలిసి ఉన్నామని కేటీఆర్ అన్నారు. ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు లాంటివి నగరంలో మరే ప్రాంతంలో రాలేదని చెప్పారు. ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, షాదీ ముబారక్ ఇస్తున్నామని చెప్పారు. రంజాన్ పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మైనార్టీ దోస్త్ సీఎం కేసీఆర్ అని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం మలక్పేట, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు తీగల అజిత్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలకు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. తొలుత మలక్పేటలో ముసారాంబాగ్ టీ జంక్షన్ చౌరస్తా అనంతరం ఉప్పల్లోని మల్లాపూర్ శివ హోటల్, ఈసీఐఎల్లో, మల్కాజిగిరిలోని మౌలాలి, మల్కాజిగిరి, ఆనంద్బాగ్, నేరేడ్మెట్, అల్వాల్ చౌరస్తా, ఓల్డ్ అల్వాల్ వరకు రోడ్ షోలో కేటీఆర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వల్లే శేరిలింగంపల్లిలో వేగంగా అభివృద్ధి జరిగిందని మంత్రి కేటీఆర్ కొనియాడారు. అల్విన్కాలనీలాస్ట్ బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ.. 24 గంటలు కరెంట్ ఎట్ల వస్తుందో.. అలానే వచ్చే టర్మ్లో మంచినీళ్లను అందిస్తామన్నారు.రెండేండ్లలో హైదరాబాద్ బెంగళూరును దాటిపోయిందని వివరించారు. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదరించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుందన్నారు. అరెకపూడి గాంధీ లాంటి నాయకుడిని గెలిపించుకుంటేనే అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు. నియోజకవర్గానికి అవసరమయ్యే కమ్యూనిటీ హాళ్లు, బస్తీ దవాఖానలు మరిన్ని కట్టుకుందామని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ముస్లింల సంక్షేమం కోసం కృషి చేయలేదని.. ఒక్క సీఎం కేసీఆర్తోనే ముస్లిం జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిరుపేద ముస్లింలకు అండగా నిలిచామని చెప్పారు.
ఎయిర్పోర్ట్ మెట్రో కోసం ఇప్పటికే టెండర్ పూర్తయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు 9 స్టాపులతో మెట్రో ఏర్పాటు కాబోతున్నదని తెలిపారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కు మద్దతుగా కాటేదాన్ స్వప్న థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆధునీకరణ డ్రైనేజీ తీసుకొస్తామని చెప్పారు. అసైన్డ్ భూములు ఉన్నవారికి సంపూర్ణ హక్కులు ఇస్తామన్నారు. 111 జీవో ఎత్తివేయడంతో లాభం జరిగిందన్నారు. హైదరాబాద్లో సంపద పెరగాలంటే సత్తా ఉన్న నేత.. ఉండాలని.. అది ఒక్క సీఎం కేసీఆర్కే ఉందని చెప్పారు. కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని కోరారు.