మియాపూర్, జూన్ 3: అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ.. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు అనిల్రెడ్డి విమర్శించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళీనగర్ ప్రధాన రహదారిపై 20 రోజులుగా మురుగు నీరు పారుతూ చెరువును తలపిస్తున్నా సమస్యను పరిష్కరించకపోవటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి అనిల్రెడ్డి బుధవారం మురుగు నీటిలో బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గాంధీ ఫ్లెక్సీలు చేతపట్టి సమస్య పరిష్కరించాలని నినదించారు. 2 రోజులలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామని అనిల్ రెడ్డి హెచ్చరించారు.
