మన్సూరాబాద్, మే 15: కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ రింగ్రోడ్డులో నిరసన చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వలన నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు.
పెరిగిన నిత్యావసర సరుకుల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ పస్తులు ఉండే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సామాన్యుల బాగోగులు పట్టడం లేదని.. ఇంధన ధరల పెంపు వలన ప్రజలపై భారం పడుతుందన్నారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల సమయంలో తాము ప్రజలపై ఎలాంటి భారం మోపడంలేదని.. డీజిల్ పెట్రోల్ ధరలు పెంచే ఆలోచన లేదని కేంద్రం ప్రగల్భాలు పలికిందన్నారు. ఎన్నికలు ముగియగానే కేంద్రం తన నిజ స్వరూపాన్ని బయట పెట్టి ఇష్టానుసారంగా ధరలను పెంచుకుంటూ పోతుందన్నారు.
ఇంధన ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింతగా ఉద్యమిస్తామన్నారు. మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్రెడ్డి, జిన్నారం విఠల్రెడ్డి, భవానీ ప్రవీణ్కుమార్, సాగర్ రెడ్డి, సామ తిరుమల్ రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, విశ్వేశ్వర్ రావు, చిరంజీవి, జగదీశ్యాదవ్, రాహుల్ గౌడ్, కొసనం వెంకట్రెడ్డి, పారంద నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.
మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందని, పొదుపు సూత్రాలను పాటించాలని ప్రజలకు చెప్పడం విడ్డూరంగా ఉందని, పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే రద్దు చేయాలి. బతుకడానికే కష్టమవుతున్న పేదల బతుకులపై పెట్రోల్ ధరలు మోపడం సరికాదు. పెరిగిన నిత్యావసరాల ధరలతో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని, పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలపై మోయలేని పెనుభారం పడుతుంది.
– షేక్ షావలి,ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్యుడిపై భారం మోపడమే. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ , డీజిల్ ధరలు పెరగడం వలన ప్రతి కుటుంబం నెల వారి బడ్జెట్ పై తీవ్రమై ప్రభావం చూపుతుంది. కేంద్ర ప్రభుత్వం పెద మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా పునరా లోచించాలి. వెంటనే ధరలు తగ్గించాలి.
– హరిశంకర్రెడ్డి, మాజీ కార్పొరేటర్
మోదీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు,రెండునాల్కల సర్కార్, ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికలు ముగిసిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారు. నాలుగు రాష్ర్టాల్లో ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మరోమారు మోసం చేసింది. ఆరు నెలల స్టాక్ ఉందని గొప్పలకు పోయి ఇప్పుడు యుద్ధం కారణమని చెప్పడం గమనార్హం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
– జక్క వెంకట్రెడ్డి, మాజీ మేయర్
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా,దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం భారీ పన్నులతో ప్రజలను దోచుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదు.
– నెల్లికంటి సత్యం,ఎమ్మెల్సీ