కేంద్ర మంత్రిగా బాధ్యతతో వ్యవహరించాల్సిన బండి సంజయ్ తన పదవిని అడ్డుపెట్టుకొని పోక్సో కేసులో నిందితుడైన తన కుమారుడిని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదని మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, తుల ఉమ అన్నారు. కేంద్ర మంత్రి హోదాలో తాను ఏం చేసినా చెల్లుతుందనే భావనలో సంజయ్ ఉన్నారన్నారు. పోలీసులూ సంజయ్ కొడుకును రక్షించేందుకు తాత్సరం చేశారన్నారు. బండి సంజయ్ను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
చార్మినార్, మే 18 : సోమవారం నగర బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి తుల ఉమ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని బేటీ బచావ్, బేటీ పడావ్ అంటూ నినదిస్తున్నా.. ఆ నినాదాలను కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బీజేపీ నేతలే తుంగలోకి తొక్కుతున్నారన్నారు. కేసును ప్రభావితం చేస్తూ సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన బండి సంజయ్ను సైతం పోక్సో కేసు నిందితుడైన తన కుమారుడికి సహకరించినట్లుగా పోలీసులు గుర్తించాలన్నారు.
ప్రధాని మోదీ ఈ విషయంపై విచారణ జరిపించి, కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలన్నారు. బండి సంజయ్ ఏ కార్యం ప్రారంభించాలన్నా భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం అనంతరమే ప్రారంభిస్తారని, ఆయనకు సద్బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకునేందుకు భాగ్యలక్ష్మీ దేవాలయానికి వచ్చినట్లు ఉమ చెప్పారు. ఈ కార్యక్రమంలోగొంగడి సునీతతోపాటు గుంటి మంజుల, తాడ్ర మేఘన, పద్మా, శాంతి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.