హిమాయత్నగర్, నవంబర్ 27: రాష్ట్రంలోని దళిత క్రైస్తవులు, మాదిగల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందున బీఆర్ఎస్కే అండగా ఉంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేయాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు జి.డేవిడ్ శాంతరాజు మాట్లాడుతూ, గతంలో దేశంలో, రాష్ట్రంలో పరిపాలన చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దళిత క్రైస్తవులకు, మాదిగలకు చేసిందేమీ లేదని, ఓటు బ్యాంకుగానే చూశాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని, అందుకు తాము బీఆర్ఎస్కు అండగా నిలబడుతున్నామని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని, 2014లో హామీ ఇచ్చి మోసం చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని ఎస్సీ వర్గీకరణను తేర మీదకు తీసుకు వచ్చారని ఈ విషయాన్ని మాదగలు గుర్తించాలన్నారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తన స్వార్థ ప్రయోజనాల కోసం మాదిగల అస్థిత్వాన్ని ప్రతి ఎన్నికల్లో బీజేపీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
దళితులు ఆర్థికంగా బలోపేతం కావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, దశల వారీగా పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. దళిత క్రైస్తవులకు, మాల, మాదిగలకు రాజకీయ రంగంలో సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కావాలంటే బీఆర్ఎస్ తరుపున పోటీచేసే అభ్యర్థులను గెలిపించాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో జేఏసీ నాయకులు భక్తుల ఉదయ్రాజ్, ఎన్.పోచయ్య ఇజ్రాయిల్, బిషప్ స్వామిదాస్, కరుణాకర్, రాజ్కుమార్, కె.శ్రీనివాస్, అబ్రహం, జయనంద్ పాల్గొన్నారు.