KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ నిర్మాణాన్ని ఎంతో మంది ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఇంత చక్కటి వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లో మహా ప్రస్థానం అని కట్టారు. దాని కంటే ఇది అద్భుతంగా ఉందని గర్వంగా చెప్పొచ్చు అని కేటీఆర్ అన్నారు.
నగరం విశ్వనగరంగా ఎదగాలంటే అద్భుతమైన ఫ్లై ఓవర్లు, ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలి. దాంతో పాటు 24 గంటల కరెంట్ ఉండాలి. మంచినీటి సరఫరా ఉండాల్సిందే. చెరువులు, నాలాలు బాగు చేసుకోవాలి. ఈ 9 ఏండ్లలో హైదరాబాద్ మహా నగరం మనందరం గర్వపడే విధంగా తయారైందా..? లేదా..? అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్ అభివృద్ధిని చూసి తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ప్రశంసించారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలను చూస్తుంటే.. ఇది మన దేశంలో ఉన్నదా..? లేక న్యూయార్క్ నగరమా.. అనే స్థాయిలో హైదరాబాద్ మారిపోయింది అని రజనీకాంత్ అన్నారు. సినిమా యాక్టర్ లయ అనే అమ్మాయి కూడా హైదరాబాద్పై ప్రశంసలు కురిపించింది. అమెరికాలో ఉంటున్న ఆమె ఈ మధ్యలోనే హైదరాబాద్కు తిరిగి వచ్చింది. కొన్ని కొన్ని ప్రాంతాలను చూస్తుంటే లాస్ ఏంజెల్స్లో, న్యూయార్క్లో ఉన్నట్టు అనిపిస్తుందన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
హైదరాబాద్ అంతా మారిపోయింది. భూతలస్వర్గం అయిపోయిందని తాను చెప్పట్లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. సమస్యలు ఉన్నాయి.. ఇంకా ఉంటాయి. మనిషి భూమ్మీద ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. అమెరికాలో ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. కనీసం మౌలిక వసతులు, కరెంట్, నీళ్లతో పాటు ఇతర అవసరాలు కల్పించాలి. వాటిపై దృష్టి సారించాలి. ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలి. సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మంచి నాయకులను, ప్రభుత్వాలను కాపాడుకోవాలి. కేసీఆర్ను మూడోసారి గెలిపించుకునేందుకు చిత్తశుద్ధిగా పని చేయాలి అని కేటీఆర్ తెలిపారు.
అన్ని నాలాలను అభివృద్ధి చేస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. లక్ష డుబల్ బెడ్రూం ఇండ్లు కట్టాం. ఈ నాలుగు నెలల్లోనే అందిస్తాం. దశబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నాం. కులం, మతం అనే తేడా లేకుండా ముందుకు వెళ్తున్నాం. ఎయిర్పోర్టు దాకా మెట్రో వేసుకుంటున్నాం. ప్రభుత్వ చిత్తశుద్ధిని అందరూ గమనించాలి. మాటలు తిట్టడం ఈజీ.. మాకు కూడా తిట్లు వస్తాయి. కానీ ప్రజలకు ఏం చేశామనేది ముఖ్యం. బీజేపీ నాయకులు ఒక రూపాయి కూడా సాయం చేయలేదు. హైదరాబాద్ వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 660 కోట్ల సాయం చేసింది. కనీసం ఆరు పైలు కూడా కేంద్రం సాయం చేయలేదు అని కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మీ కోసం చిత్తశుద్ధితో హైదరాబాద్ నగరాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాం. పెట్టుబడులు తరలివస్తున్నాయి. అందుకు కారణం రాజకీయ స్థిరత్వమే అని కేటీఆర్ పేర్కొన్నారు.