మియాపూర్, ఫిబ్రవరి 10: రాజకీయాల కోసం కులం మతం పేరిట ప్రజల మధ్య విభజన వాదాన్ని ప్రతిపక్షాలు పెంచి పోషిస్తున్నాయని, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కులమతాలు ప్రాంతాలకతీతంగా ప్రజలంతా ఒక్కటేనన్న ఏకైన నినాదంతో అభివృద్ధి మంత్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. ఈ నెల 17వ తేదీన నూతన సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, కోఆర్డినేటర్ సతీశ్ అరోరాలతో కలిసి శుక్రవారం తన నివాసంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ప్రమాదకరమన్నారు. ఏండ్ల నుం చి వెనకబడి ఉన్న తెలంగాణ కేవలం ఎనిమిదిన్నరేండ్లలో అభివృద్ధి పుంతలు తొక్కుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ తన పాలనా దక్షతతో రాబో యే రోజుల్లో రాష్ర్టాన్ని మరింత పురోగతితో దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దటం తథ్యమని ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు. 17న సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈనెల 13వ తేదీన నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నూతన సచివాలయానికి పెట్టడం సహా అభివృద్ధి అంశాలపై చర్చిస్తామన్నారు.
ఈ నెల 16వ తేదీన అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే సింహభాగం అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నట్లు, మిగిలిన పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.