మేడ్చల్, అక్టోబర్24 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం మరింత వేగం పెంచేలా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రణాళికను సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఇంటింటికీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీల నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చేస్తున్న ప్రచారానికి కూడా విశేష స్పందన లభిస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో పథకాల హామీలను ఇంటింటికీ ప్రచారం చేసేలా ప్రణాళికను రూపొందించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నేరవేర్చడంతో పాటు అదనంగా మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన వారందరికీ అందజేశారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా, అన్నపూర్ణ పథకం, ఆసరా పెన్షన్ 5,016, దివ్యాంగులకు 6 వేల పెన్షన్ పెంపు, రైతుబంధు 16 వేలు, ఆగ్రవర్ణ పేదలకు గురుకులాలు, కేసీఆర్ ఆరోగ్యరక్షకు రూ. 15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి రూ. 3 వేలు మహిళలకు జీవనభృతి, గ్యాస్ సిలిండర్ రూ. 4వందలకే, మహిళ సమాఖ్యలకు సొంత భవనాలు, హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్రూమ్లను అందించే హామీలను ఇంటింటికీ ప్రచారం చేసి వివరించనున్నారు. దీనికి సంబంధించి మ్యానిఫెస్టోలను కరపత్రాలను ఇంటింటికీ అందజేయనున్నారు.