ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగుతున్నది. గ్రేటర్లో పండుగ వాతావరణంలో ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీయే లక్ష్యంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. కలిసికట్టుగా చేస్తున్న ప్రచారానికి సకలజనులు మద్దతు పలుకుతున్నారు. విపక్షాల నాయకులు కూడా ఆయా పార్టీలను వదిలి కారెక్కుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని విశ్వసిస్తున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి బీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
– సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగుతున్నది. విపక్షాల అభ్యర్థుల ఖరారు..బీ ఫాంల అందజేత, అసంతృప్తుల బుజ్జగింపులతోనే కొట్టుమిట్టాడుతుండగా… బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో తనదైన పంథాను చాటుతోంది. అభ్యర్థులు గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
బూత్ కమిటీ కార్యకర్త నుంచి మంత్రులు, ఇన్చార్జీల వరకు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటీ ప్రచారం, పాదయాత్రలు, మరోవైపు కలిసివచ్చే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ మరింత బలోపేతం చేస్తున్నారు. మరోవైపు బూత్ కమిటీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలతో మంత్రి కేటీఆర్ పాల్గొని క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపుతూ అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి అభ్యర్థుల గెలుపునకు బాటలు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రంగా కాలనీలు, బస్తీలు తిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్న తీరు పట్ల పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లెరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో దూసుకువెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కార ం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేయాలన్న గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాల ప్రకారం అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే అస్ర్తాలుగా సాగు తూ లబ్ధిదారులు, వారి కుటుంబాలతో పాటు ప్రజల నుంచి ఆశీర్వాదం పొందుతున్నారు. ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు.