గోల్నాక, ఫిబ్రవరి 27 : సికింద్రాబాద్ పార్లమెంట్కు డూడూ బసవన్న కిషన్ రెడ్డి కావాలా..? మన హక్కులు, అభివృద్ధిపై కొట్లాడే నాయకుడు కావాలా ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం అంబర్పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, అరెకపూడి గాంధీ, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు తలసాని సాయి కిరణ్యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి క్లీన్ స్వీప్ చేశారని వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.
దాదాపు 15 ఏండ్లు ఉద్యమ కాలంలో, 10 ఏండ్లు తెలంగాణ అభివృద్ధిలో వంద స్పీడ్తో కారు దూసుకెళ్లిందని అన్నారు. అయితే కారు సర్వీసింగ్ అనంతరం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జెట్ స్పీడ్తో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందన్నారు. 119 సీట్లలో 39 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మి కేసీఆర్ను దూరం చేసుకున్నామని ప్రజలు బాధ పడుతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని 420 హామీలని అన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదన్న కేసీఆర్ మాటలను ఇపుడు నిజం అవుతున్నాయని చెప్పారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తన నియోజకవర్గానికి పైసా ఖర్చు చేయలేదన్నారు.
కేసీఆర్ ప్రపంచం గర్వపడేలా కాళేశ్వరం లిఫ్టులు ప్రారంభిస్తే…కిషన్ రెడ్డి మెట్రో రైల్వే స్టేషన్ లిఫ్టులు, సింటెక్స్ ట్యాంకులను ప్రారంభిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ముఖం చూసి ఓటేయాలని కిషన్రెడ్డి అడుగుతున్నాడని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడం బీజేపీకే చెల్లిందన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో గళం విప్పేది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే పార్ల మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పని చేసిన నాయకులకు భవిష్యత్తులో మంచి గుర్తింపు నివ్వాలని కేటీఆర్ను కోరారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్, బి.పద్మావెంకట్రెడ్డి, విజయ్కుమార్గౌడ్, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి డీపీ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డితో పాటు దాదాపు 3 వేల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.