గోల్నాక ( హైదరాబాద్ ) : నగరంలోని అంబర్పేట నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీకి షాక్ ఇచ్చారు. వారితో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు గురువారం బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు.
గోల్నాక క్యాంపు కార్యాలయం వద్ద అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh ) , అంబర్పేట కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్ సమక్షంలో బాగ్అంబర్పేట డివిజన్ విజ్ఞాన్పురి కాలనీకి చెందిన బీజేపీ కిసాన్ మోర్చ నగర కార్యదర్శి బి.రఘురాంరెడ్డి, రమేశ్ గౌడ్, కాచిగూడకు చెందిన ఏ.లక్ష్మణ్గౌడ్ తోపాటు అంబర్ పేట డివిజన్ కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు బ్రహ్మచారి తదితరులు బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మరో వైపు అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీతో పాటు ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల గత పదిహేనేండ్లుగా అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతోందని తెలిపారు.
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల లబ్ధిదారులకు అందజేయడంతో పాటు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకునేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. పార్టీలో కష్ట పడే ప్రతి నాయకుడికి తగిన ప్రధాన్యం ఇస్తామని వెల్లడించారు.