అల్లాపూర్, మార్చి 5: ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బోరబండ నివాసి వరలక్ష్మి మంగళవారం ఉదయం ఎర్రగడ్డలో పటాన్చెరు వెళ్తున్న 219 నంబర్ ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. కూర్చోడానికి సీటు లేదు.. కనీసం నిలబడడానికి కూడా చోటు లేకుండా ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఆ మహిళ ఫుట్బోర్డు ప్రయాణం చేసింది. కూకట్పల్లి బస్టాప్లో ఆ మహిళ ప్రమాదవశాత్తు బస్సులో నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో బస్టాపులో ఉన్న ప్రయాణికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలు విరిగిందని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వారి ప్రాణాల మీదకు తీసుకువచ్చిందంటూ అక్కడున్న ప్రజలు మండిపడ్డారు. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. బస్సుల సంఖ్య ఎక్కువగా లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.