అమీర్పేట్:రాంగోపాల్పేట్ డివిజన్లోని ఆర్పి రోడ్డులో రూ.2.35 కోట్ల వ్యయంతో చేపడుతున్న వంతెన విస్తరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలిస్తూ వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆయన మట్లాడుతూ వర్షకాలంలో ఎగువ నుండి కొట్టుకువచ్చే వరద నీరు సాఫీగా పారేందుకు ప్రస్తుతం ఉన్నవంతెన వెడల్పు సరిపోవడం లేదని, దీంతో వరదనీరంతా రోడ్లపైకి చేరుతుండడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతుండడమే కాక ముంపు సమస్యకు దారి తీస్తోందన్నారు. అయితే ఈ వంతెన విస్తీర్ణం పెరిగితే వరదనీరు సాఫీగా పోయేందుకు అవకాశం ఉందని నిపుణులు చేసిన సూచనల మేరకు వంతెన విస్తరణ పనులను శ్రీకరాం చుట్టడం జరిగిందని వివరించారు.
ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి చేస్తే వరద ముంపు సమస్య తీరినట్టేనని మంత్రి వివరించారు. అయితే సంబంధిత పోలీస్, జీహెచ్ఎంసీ విభాగం అధికారులు సమన్వయంతో వ్యవహరించి వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని, వంతెన ఒకవైపు నిర్మాణం పూర్తికావడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, ఎస్ఈ అనిల్, టౌన్ప్లానింగ్ ఏసీపీ కృష్ణమోహన్, జలమండలి జీఎం రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.