మల్కాజిగిరి జోన్ బృందం, ఏప్రిల్ 14 : భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతిని గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్లు, నాయకులు , అధికారులు, దళిత సంఘాల నేతలు పూలమాలలువేసి నివాళులర్పించి.. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు..అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా జేఎల్ఎన్ఎస్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులకు రూ.10లక్షలకు సంబంధిత మంజూరు పత్రాలను జేఎల్ఎన్ఎస్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు అన్ని విధాలా అభివృద్ధి దశలో ఉండాలన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు.
మౌలాలిలో కార్పొరేటర్లు మేకల సునీతారాముయాదవ్, ప్రేమ్కుమార్, నాయకులు పిట్ల శ్రీనివాస్, మేకల రాముయాదవ్, మంద భాస్కర్, అమీనొద్దీన్, భాగ్యనందరావు, సత్తయ్య, మోహన్రెడ్డి, సంతోష్ ముదిరాజ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.