హైదరాబాద్ : భారతీయ కరెన్సీ రూపాయి నిరంతరం రికార్డు కనిష్ఠ స్థాయిలకు పడిపోవడం నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక పాలనలో జరిగిన ఘోర వైఫల్యానికి స్పష్టమైన సంకేతమని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ (Boyalapalli Rekha) విమర్శించారు. రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకున్నప్పటికీ ప్రాథమిక ఆర్థిక పరిస్థితులు బలహీనంగానే ఉన్నాయని, పెరుగుతున్న ముడి చమురు దిగుమతి, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర నిష్క్రమణ, స్పష్టమైన విధానపరమైన లోపాలే రూపాయిని ప్రమాదకర స్థాయికి నెట్టాయని రేఖ మండిపడ్డారు.
తమ హయాంలో బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వ వాదనలు రూపాయి పతనంతో ఇప్పుడు పూర్తిగా బహిర్గతమయ్యాయని బోయలపల్లి రేఖ తెలిపారు. మోడీ పేర్కొంటున్న “విశ్వగురు” ఆర్థిక దృక్పథం వాస్తవ పరిస్థితులకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తోందని ఆమె ధ్వజమెత్తారు.
‘రూపాయి పతనం కేవలం సంఖ్యల ఆట కాదు, ఇది ప్రతి కుటుంబాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ, అవసరమైన వస్తువుల ధరలను పెంచుతూ.. ఇప్పటికే ధరల భారంతో ఇబ్బంది పడుతున్న మహిళలు కుటుంబాలపై అదనపు భారం మోపుతోంది. మరింతగా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం. నిర్మాణాత్మక ఆర్థిక సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆశ్చర్యంగా కథనాలు, ప్రచారాల మీదే ఆధారపడుతోంది. భారతదేశానికి కావాల్సింది నినాదాలు కాదు. ఆర్థిక స్థిరత్వాన్ని ప్రాధాన్యంగా తీసుకునే పాలన అవసరం’ అని మోడీ సర్కార్ను కడిగిపారేశారు రేఖ.
రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి చేరిన ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, రూపాయిని స్థిరపరచడానికి, ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నాయకత్వం అవసరమని బోయలపల్లి రేఖ అభిప్రాయపడ్డారు. ‘రూపాయి పతనం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని భారత జాతీయ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బలమైన ఆర్ధిక వ్యవస్థ నిర్మాణం అనేది ప్రసంగాలతో కాదు బాధ్యతాయుతమైన పాలనతో, ద్రుఢమైన చర్యలతోనే సాధ్యమవుతుందని మోడీ ప్రభుత్వానికి రేఖ సూచించారు.