మలక్పేట, ఏప్రిల్ 22: విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాల మీదికి తెచ్చింది. కాలనీలో సరదాగా క్రికెట్ ఆడుకుంటుండగా బాల్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడటంతో బంతి తెచ్చుకోవటానకి వెళ్లిన బాలుడు.. యమపాశాల్లా వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన జగదీష్ నానాజీ కుమారుడు కౌశిక్ నానాజీ(12) బుధవారం కాలనీలోని రోడ్డుపై సరదాగా క్రికెట్ ఆడుతుండగా బాల్ ఎగిరిపోయి కంచెలేని ట్రాన్స్ఫార్మర్ వద్ద పడింది.
దాంతో బంతిని తెచ్చుకునేందుకు వెళ్లిన కౌశిక్ చేయి, ముఖానికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగలటంతో మంటలు అంటుకొని బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారి తల్లిదండ్రులకు తెలుపగా, వారు హుటాహుటన మలక్పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స కోసం ముందుగా కొంత డిపాజిట్ చేయాలని ఆసుపత్రి వర్గాలు మొండికేయటంతో వారి కుటుంబ సభ్యులు, స్థానికులు పాత మలక్పేట డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీకి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న షఫీ ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలకు సమాచారం అందించటంతో స్పందించిన ఆయన ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించాలని సూచించగా, వారు బాలుడికి చికిత్స ప్రారంభించారు.