మైలార్దేవ్పల్లి, ఫిబ్రవరి 15 : ఓ బాలుడిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి స్పెషల్ రాజేంద్రనగర్లోని పోక్సో ట్రయల్ కోర్టు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించింది. మైలార్దేవ్పల్లిలో నివాసం ఉంటున్న సయ్యద్ మునీరుద్దీన్ కుమారుడు 2015 డిసెంబర్ 23న కనిపించడం లేదని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా, ఓ నాలాలో బాలుడి మృతదేహం లభించింది. మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మైలార్దేవ్పల్లి వట్టెపల్లికి చెందిన సయ్యద్ మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ సోహైల్(45) ఏసీ మెకానిక్. మద్యానికి బానిసైన సోహైల్ 2015 డిసెంబర్ 22న తన ఏసీ పని ముగించుకుని మద్యం సేవించాడు. అక్కడ నుంచి ఆటోలో పురానాపూల్ వెళ్లి గంజాయి సేవించాడు. మత్తులో సుల్తాన్పురాలో ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసి వట్టేపల్లికి చేరుకున్నాడు. ఈ సమయంలో మొగల్స్ కాలనీ లయోలా పాఠశాల ప్రాంతంలో ఓ బాలుడిని చూసిన సోహైల్ లైంగిక దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆ బాలుడిని మసీదు చిరునామా చూపించమని బైక్పై తీసుకువెళ్లాడు. రైల్వే ట్రాక్పై చీకట్లో లైంగిక దాడి చేసి, అపస్మారకస్థితికి పోయి న బాలుడి తలపై రాయితో దాడి చేశాడు. బాలుడి జననవయాలను కోసి, మృతదేహాన్ని నాలాలో పడేశాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. రాజేంద్రనగర్లోని పోక్సో ట్రయల్ కోర్టు నిందితుడు సయ్యద్ మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ సోహైల్కు జీవిత ఖైదు, రూ.17 వేల జరిమానా విధించారు.