బడంగ్పేట్/మన్సూరాబాద్ మే 12(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ చూద్దామని పిన్ని ఇంటికి వచ్చిన ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఆడుకుందామని ఇంటి నుంచి బయటికి రాగానే దాదాపు పది కుక్కలు బాలుడిని సెల్లార్లోకి లాక్కెళ్లి తీవ్రంగా గాయపర్చాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మీర్పేట టీచర్స్కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వేసవి సెలవుల కోసం సిద్దిపేటకు చెందిన అద్విక్ తన కుటుంబ సభ్యులతో కలిసి మీర్పేట టీచర్స్ కాలనీలో ఉంటున్న పిన్ని ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులంతా ముచ్చట్లు పెడుతుండగా.. అద్విక్ ఆడుకుంటానని సోమవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వచ్చాడు.
అంతే అక్కడ ఉన్న వీధికుక్కలు వెంటనే బాలుడిపై పడి దాడి చేశాయి. తీవ్రంగా గాయపర్చాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామినేనికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేసవి సెలవుల ఆనందం కోసం వచ్చిన చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం అలుముకున్నది. ఇకనైనా వీధికుక్కల నియంత్రణపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి..
బీఎన్రెడ్డి డివిజన్ టీచర్స్కాలనీ ఫేజ్-2లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్ కామినేని దవాఖానలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలుడు అద్విక్ను మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా చూడాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. అద్విక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాలుడి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. నియోజకవర్గంలోని వీధి కుక్కల అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.