రూ. 8.40 కోట్లతో అప్పా చెరువు వద్ద బాక్స్ డ్రైన్ ఏర్పాటు
చకచకా సాగుతున్న పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 3: ముంపు సమస్య రాకముందే చెరువుల వద్ద బాక్స్డ్రైన్ నాలా పనులు చకచకా సాగుతున్నాయి. భారీ వర్షాలకు వరద నీరు చెరువులో చేరడంతో చెరువులు నిండి పొంగుతున్నాయి. దీంతో ప్రభుత్వం చెరువుల సంరక్షణలో భాగంగా బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేస్తుంది. చెరువులో నిండిన నీరును బయటికి వదిలేలా సిద్ధం చేస్తున్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని అప్పాచెరువులో రెండేండ్ల క్రితం అప్పాచెరువులో వరద నీరు ఎక్కువ కావడంతో కట్ట తెగి నీరు ప్రవాహంలా హైవే పైకి రావడంతో ఆరుగురు గల్లంతై ప్రాణాలు పోగొట్టుకున్నారు.
వరద నీరు రోడ్డు పైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎస్ఎన్డీపీ నిధులు రూ. 8.40 కోట్లతో అప్పాచెరువు నుంచి బాక్స్ డ్రైన్ను నిర్మిస్తున్నారు. 15 అడుగుల వెడల్పు 550మీటర్ల పొడవుతో నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వచ్చేసరికి బాక్స్ డ్రైన్ పనులు పూర్తిచేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. రాబోయే వర్షాకాలం వచ్చేసరికి ఎవరికి ఇబ్బందులు కలుగ కుండా పనులు పూర్తవుతాయని తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్య క్తం చేస్తున్నారు.
త్వరలో పనులు పూర్తి
పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలం రాక ముందే బాక్స్ డ్రైన్ పనులు పూర్తి చేస్తాం. గతేడాది నిధులు మంజూరు చేసినప్పటికి టెండర్లలో కొంత ఆలస్యమైంది. రెండు నెలల క్రితం పనులు మొదలు పెట్టాం. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పర్యవేక్షిస్తున్నాం.
–ఫైజల్ ఖాజా, జీహెచ్ఎంసీ ఏఈ