అల్వాల్, ఫిబ్రవరి 1: అల్వాల్ డివిజన్లోని తిరుమల ఎన్క్లేవ్ వద్ద జరుగుతున్న బాక్స్డ్రైన్ పనులను 15-20 రోజుల్లో పూర్తి చేయాలని గుత్తేదారును కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ చిన్నారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం వారు బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని.. రాత్రీపగలు పనిచేసి త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
శ్రీబేకరీ మార్గంలో పనులు పూర్తికావడంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని, రాజీవ్ రహదారి నుంచి సుచిత్ర వెళ్లే ప్రధాన రోడ్డును మూసివేయడంతో వాహనాలు గల్లీల్లో నుంచి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గడువులోపు పనులు పూర్తిచేయకపోతే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మరోవైపు భెల్ కాలనీ నుంచి మల్లారెడ్డి కాలనీ వరకు బాక్స్డ్రైన్ పనుల ప్రణాళికను వెంటనే పంపించాలని డీఈకి ఎస్ఈ సూచించారు. కార్పొరేటర్ వెంట ఈఈ రాజు, డీఈఈ మహేశ్, ప్రశాం తి, కవిత, అరవింద్, అశ్విన్ తదితరులు ఉన్నారు.
కంటివెలుగుకు విశేష స్పందన..
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకానికి విశేష స్పందన లభిస్తున్నదని అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆమె.. స్థానిక మండపంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, అవసరమైన వారు ఉచితంగా కళ్లద్దాలు పొందాలని సూచించారు. కార్యక్రమం లో డా.లక్ష్మీప్రసన్న, అరుణ, కవిత, అరవింద్, అశ్విని, కుమారి, తదితరులు పాల్గొన్నారు.