ORR | సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ సర్వీసు రహదారిపై జారిపడుతున్న బండరాళ్లు..ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా కొన్ని చోట్ల భారీ ఎత్తయిన గుట్టలను తొలిచి.. రోడ్డు మార్గాన్ని నిర్మించారు. అలాంటి ప్రాంతాల్లో గుట్టల నుంచి బండరాళ్లు జారి.. సర్వీసు రోడ్డు మీదకు వస్తున్నాయి. తరచూ ఇలా జరుగుతుండటంతో ఔటర్ సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణికులు భయపడుతున్నారు.
ముఖ్యంగా నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు ఉన్న మార్గంలో మంచిరేవుల వద్ద, రాజేంద్రనగర్-హిమాయత్సాగర్ ఇంటర్చేంజ్ నుంచి శంషాబాద్ వరకు ఉన్న రెండు మార్గాల్లో ఎత్తయిన గుట్టల మధ్య నుంచే ఔటర్ను నిర్మించారు. ఆయా ప్రాంతాల్లోని సర్వీసు రోడ్డుపై ఎప్పుడు బండరాయి జారి మీద పడుతుందోనన్న భయం వాహనదారుల్లో నెలకొన్నది. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో సర్వీసు రోడ్ల మీద రాకపోకలు సాగించలేదని పరిస్థితి ఉంది.
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై ఉన్న ప్రధాన రహదారి నిర్వహణ సజావుగానే ఉన్నా.. దానికి ఇరువైపులా ఉన్న సర్వీసు రహదారుల నిర్వహణను సరిగా చేపట్టడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఉన్న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లపై భవన నిర్మాణ రంగానికి సంబంధించిన సామగ్రితో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాహనాల్లోంచి మట్టి, కంకర సైతం పడుతున్నా, దాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. అటు జారిపడుతున్న బండరాళ్లు ఒకవైపు.. మట్టి..కంకర మరోవైపు సర్వీసు రోడ్ల మీదుగా ప్రయాణమంటేనే వాహనదారులు జంకుతున్నారు.