ఎర్రగడ్డ, జూలై 13: ఎర్రగడ్డ నటరాజ్నగర్లో గతనెల భార్యను హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు బోరబండ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ కామల్ల రవికుమార్ కథనం ప్రకారం.. మిరాజ్, ఫాతిమా దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. ఈ కుటుంబం ఎర్రగడ్డ నటరాజ్నగర్లోని ఓ ఇంటిలో అద్దెకు ఉన్నారు. మటన్ షాప్లో పనిచేసే మిరాజ్కు భార్య ప్రవర్తనపై అనుమానాన్ని పెంచుకుని నిత్యం గొడవ పడ్డాడు. ఇదే క్రమంలో గతనెల 27న భార్యతో గొడవపడిన మిరాజ్.. మటన్ షాప్ నుంచి తెచ్చుకున్న కత్తితో దారుణంగా పొడిచి ఫాతిమాను హత్య చేశాడు.
ఆ తర్వాత ఇంటి గదికి బయట నుంచి గడియ పెట్టి పారిపోయాడు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూపీలోని బలరాంపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిందితుడు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఓ బృందాన్ని అక్కడికి పంపించింది. అక్కడ మిరాజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం నగరానికి తీసుకొచ్చారు. హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేసిన పోలీసులు, నిందితుడిని చంచల్గూడ జైలుకు తరలించారు.. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బోరబండ పోలీస్ ఇన్స్పెక్టర్ కామల్ల రవికుమార్, ఎస్సైలు సర్దార్ జమాల్, మనోజ్కుమార్, కానిస్టేబుళ్లు రవి, రాంబాబు, లింగమూర్తిలను పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ అభినందించారు.