బేగంపేట, జూలై 7: ఆషాడ బోనాలు అంటేనే హైదరాబాద్ జంట నగరాల్లో నెల రోజుల పాటు ఎంతో సందడిగా ఉంటుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ ప్రతినిధులు ఈ నెల 13 వ తేదీన మహంకాళి ఆలయంలో నిర్వహించే హోమానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం అందజేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నెల 11 వ తేదీన మహంకాళి ఆలయ పరిసరాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించనున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు సమగ్రంగా జరిగేలా పర్యవేక్షించనున్నట్లు వివరించారు. దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో గత 99 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అందిస్తున్న సేవలను అభినందించారు.