తనిఖీలు చేసిన రైల్వే పోలీసులు
బాంబు లేదని నిర్ధారణ.. ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు
మారేడ్పల్లి, మే 31: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని శబరి ఎక్స్ప్రెస్ రైల్లో బాంబు పెట్టాం.. అంటూ గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేశాడు. భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటు రైల్వే జీఆర్పీ, అటు ఆర్పీఎఫ్ పోలీసులు, బాంబు, డాగ్ స్కాడ్తో రైలులో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని రెండో నంబర్ ప్లాట్ ఫారంపై శబరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.
ఇదే సమయంలో సూమారు 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి.. శబరి ఎక్స్ప్రెస్ రైల్లో బాంబు పెట్టాం.. అని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు బోగీలను తనిఖీ చేశారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని పోలీసులు సూచించారు. సూమారు 50 నిమిషాల పాటు రైలును తనిఖీ చేసిన అనంతరం బాంబు లేదని రైల్వే పోలీసులు నిర్ధారించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులు రైలును ప్లాట్ ఫారం నుంచి పంపించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను తెలిపారు.