హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలుస్తామని అందులో హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్టు సిబ్బంది విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బెదిరింపులకు పాల్పడింది న్యూయార్క్కి చెందిన జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిన్న మూడు విమానాలకు..
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) వచ్చే విమానాలకు బాంబు బెదిరింపుల (Bomb Threat) పరంపర కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వస్తున్న రెండు విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు విమానాలకు బెరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, పోలీసులు అలర్ట్ అయ్యారు. తనిఖీలు చేపట్టారు.
సోమవారం ఉదయం కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో వీటిని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అనతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. విమానాలను ఐసోలేషన్కు తరలించారు.