సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : సే నో టూ డ్రగ్స్ థీమ్తో ఎల్బీ స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో టాలీవుడ్ను ఓడించిన బాలీవుడ్.. సీసీసీ కప్ను గెలుచుకుంది. క్రెసెండ్ క్రికెట్ కప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. తొలుత సినీ హీరో తారకరత్న మృతికి సంతాపం ప్రకటించిన సినీ తారలు ఆ తర్వాత.. సే నోటు డ్రగ్స్ థీమ్తో పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బాలీవుడ్ టీం 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బాలీవుడ్ తరఫున ఆడారు. సెకండాఫ్లో పోటీపడ్డ టాలీవుడ్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి ఓటమిపాలైంది. బాలీవుడ్ జట్టుకు అర్బాజ్ ఖాన్, టాలీవుడ్కు ప్రభాకర్ కెప్టెన్లుగా ప్రాతినిధ్యం వహించారు. టాలీవుడ్ జట్టులో వరుణ్ సందేశ్, తనీశ్, సోహెల్, శ్రావణ్ రాఘవేంద్ర, ఖయ్యూం, వీజే సన్నీ, రేవంత్, శ్రీరాంచంద్ర, అమిత్, రవికృష్ణ ఉండగా..
బాలీవుడ్లో అభిషేక్ కపూర్, ముదశ్రీ భట్ తదితరులు ఉన్నారు. విరామ సమయంలో జబర్దస్త్ ఆర్టిస్టులు కామెడీ స్కిట్లు, డ్యాన్స్లతో హోరెత్తించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించి అవేర్నెస్ కల్పిస్తున్నామని సీసీసీ చైర్మన్ కె.ఎం.షకీల్ సఫీ తెలిపారు.