కంటోన్మెంట్, సెప్టెంబర్ 3 : కరోనా కారణంగా 16 నెలల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. థర్డ్ వేవ్ భయంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు వెనుకాముందు అవుతున్నారు. కానీ, ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన ఇద్దరు పిల్లలను (కవలలు) ఆయన బోధిస్తున్న పాఠశాలలోనే చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆడంబరాలకు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలని, పిల్లల భవిష్యత్కు బంగారు బాట వేసే విద్యార్హతలు ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటారని, అందువల్లే ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించానని చెబుతున్నారు సదరు ఉపాధ్యాయుడు.
కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం రిసాలబజార్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పడిగె రాజు తన కవల పిల్లలు రాషిక, రితికలను ఒకటో తరగతిలో అదే పాఠశాలలో చేర్పించాడు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు కూతుళ్లను వెంట తీసుకెళ్తున్నాడు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యక్ష బోధన కోసం ఇన్నాళ్లు ఎదురుచూశారని చెప్పాడు. ఇప్పుడు పాఠశాలలు తెరవడంతో వచ్చేందుకు విద్యార్థులు ఇష్టపడుతున్నప్పటికీ వారి తల్లిదండ్రులు కరోనా భయంతో పంపించడం లేదన్నాడు. నిబంధనలు పాటిస్తున్నాం కాబట్టే.. తన పిల్లలను బడికి తీసుకువెళ్తున్నానని, విద్యార్థుల తల్లిదండ్రులు భయం వీడి తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని సూచించారు.