కంటోన్మెంట్, మే 5 : మల్కాజిగిరి పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఒకటో వార్డు పరిధిలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో సంచార్ పురి కాలనీ ఫేజ్ – 1, ఫేజ్ – 2, ఉమానగర్, పబ్లిక్ సెక్టార్, వాయునగర్ కాలనీల వాసులతో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా 6వ వార్డు పరిధిలో బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ నేతృత్వంలో కౌసల్య ఎస్టేట్ కాలనీ, ఐదో వార్డు పరిధిలోని న్యూవాసవి కాలనీలోని తేలకుంట్ల కృష్ణ నేతృత్వంలో ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చామని, ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. తమను గెలిపిస్తే అనునిత్యం ప్రజాసేవలో ఉంటామని తెలిపారు.